1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (12:27 IST)

కాస్ట్ ఆఫ్ లివింగ్: పెరిగిపోతున్న ఖర్చులు.. క్యాష్ చెల్లింపులకు మొగ్గు చూపుతున్న ప్రజలు

cash
జీవన వ్యయం పెరుగుతుండడంతో ఖర్చుల నియంత్రణకు ప్రజలు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లుతున్నారని బ్రిటన్ 'పోస్ట్ ఆఫీస్' తాజా అధ్యయనం వెల్లడించింది. 2022 జులైలో పోస్ట్ ఆఫీసుల నుంచి 80.1 కోట్ల పౌండ్లు (సుమారు రూ. 7,672,69,54,957 కోట్లు) నగదు ప్రజలు విత్ డ్రా చేశారని తెలిపింది. నగదు విత్ డ్రాలకు సంబంధించి అయిదేళ్ల కిందట రికార్డుల నిర్వహణ ప్రారంభించిన తరువాత ఇంత భారీ మొత్తంలో విత్ డ్రా చేయడం ఇదే తొలిసారి. గత ఏడాదితో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ.

 
ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలు ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారనడానికి ఇది నిదర్శనమని 'క్యాష్ యాక్షన్ గ్రూప్' చైర్‌పర్సన్ నటాలీ సీనీ అన్నారు. 'జీవన వ్యయ సంక్షోభం కారణంగానే ఇదంతా జరుగుతోంది' అన్నారు సీనీ. ''ప్రజలు తమ ఖాతాల నుంచి డబ్బు బయటకు తీసి ఇంట్లో దాచుకుంటున్నారు. ఆహారానికి ఎంత ఖర్చు చేయాలి.. నెలవారీ ఖర్చులకు ఎంత తీయాలి, ఇంకా ఎంత మిగిలి ఉందనేది చూసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు'' అన్నారామె. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఆదాయం పెరగకపోగా ఖర్చులు మాత్రం పెరుగుతుండడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది.

 
జులైలో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో 332 కోట్ల పౌండ్లు(రూ. 31,810,25,09,182.80 కోట్లు) జమయింది. అయితే, జూన్ నెలతో పోల్చినప్పుడు 10 లక్షల పౌండ్లు (సుమారు రూ. 95814008.79) అధికంగా విత్ డ్రా చేశారు ప్రజలు. పోస్టాఫీసుల నుంచి వ్యక్తులు నగదు విత్ డ్రా చేయడమనేది అంతకుముందు నెలల కంటే 8 శాతం పెరగగా... గత ఏడాదితో పోల్చితే ఈ పెరుగుదల 20 శాతం అధికంగా ఉంది. విత్ డ్రాలు 80 కోట్ల పౌండ్లు(సుమారు రూ. 7,665,12,07,032) దాటడం గత అయిదేళ్లలో ఇది రెండోసారి. ఇంతకుముందు 2021 డిసెంబరులో కూడా 80 కోట్ల పౌండ్లను మించి విత్ డ్రాలు నమోదయ్యాయని తపాలా శాఖ తెలిపింది.

 
ఇందుకు తగ్గట్లుగానే తపాలా శాఖ తన 11,5000 బ్రాంచ్‌లలో సాధారణం కంటే అదనంగా నగదు అందుబాటులో ఉంచుతోంది. మరోవైపు తపాలా శాఖ అధ్యయనం ప్రకారం.. 71 శాతం మంది బ్రిటన్ ప్రజలు సెలవులకు విహారాలకు వెళ్లే యోచనలో ఉండడంతో తమ పర్యటనలకు ముందు నగదు తీసుకుంటున్నారు. ''ఎక్కువ మంది నగదుపైనే ఆధారపడుతుండడాన్ని గమనిస్తున్నాం. బడ్జెట్ అదుపులో ఉంచుకోవడానికి సరైన మార్గమని నిరూపితమైన నగదును ప్రజలు నమ్ముకుంటున్నారు'' అని పోస్ట్ ఆఫీస్‌ల బ్యాంకింగ్ డైరెక్టర్ మార్టిన్ కియర్స్‌లీ చెప్పారు.

 
అయితే, నగదు ఉపసంహరణలతో పాటు నగదు డిపాజిట్లు కూడా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో వ్యక్తిగత డిపాజిట్లు జులైలో 135 కోట్ల పౌండ్లు.. ఇది అంతకుముందు నెల కంటే 2 శాతం అధికం. బిజినెస్ డిపాజిట్లు 113 కోట్ల పౌండ్లు... ఇది అంతకుముందు నెల కంటే 1.19 శాతం అధికం. ఇదంతా ఎలా ఉన్నా బ్రిటన్ ఇంకా నగదు రహిత దేశమేనని ఈ లెక్కలు చెబుతున్నాయని అంటున్నారు కియర్స్‌లీ.

 
పైసా పైసా లెక్కిస్తూ..
గత రెండేళ్ల మహమ్మారి కాలంలో నగదు వినియోగం తగ్గిందని.. మహమ్మారి ప్రభావం తగ్గడంతో మళ్లీ నగదు వాడకం మొదలైందని సీనీ అన్నారు. జీవన వ్యయ సంక్షోభం కూడా దీనికి కారణమన్నారామె. ''నగదు వినియోగం వల్ల ప్రజల బడ్జెట్ అదుపులో ఉంటుందని.. నగదు వినియోగం అంటేనే పైసాపైసా లెక్కించడం. నగుదు కాకుండా కార్డు వినియోగించడం అంటే మన దగ్గర లేని డబ్బును ఖర్చు చేయడమే' అన్నారామె. 'ఒకవేళ ఈ వారానికి మీ దగ్గర 30 పౌండ్లే ఉన్నాయనుకుంటే ఆ డబ్బును నగదు రూపంలో ఉంచుకోవడం వల్ల బడ్జెట్ మీ నియంత్రణలో ఉంటుంది' అన్నారు సీనీ.

 
చాలా బ్యాంకులు తమ బ్రాంచులను మూసేస్తున్నాయని.. ఇలాంటి తరుణంలో పోస్టాఫీసుల అవసరం ఉందని చెప్పారు. అలాగే, వయోధికులు ఇంటా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా వినియోగించుకలేకపోవడం.. చాలామందికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు వల్ల పోస్టాఫీసుల్లో నగదు లభ్యత పెంచాల్సిన అవసరం ఉందన్నారు సీనీ.