గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (15:07 IST)

రాజధాని మార్పు: ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?

కొత్త రాజధాని నిర్మాణానికి 24 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. దాదాపు 15 లక్షల మంది నివసించేందుకు వీలుగా 30 నుంచి 40 వేల హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. అయితే, పలు దేశాల రాజధానులను కొత్తగా నిర్మించారు. అలాంటి రాజధానులు ఏవో ఓసారి తెలుసుకుందాం. 
 
ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న జకర్తా నగరం నుంచి బోర్నియో ద్వీపానికి రాజధానిని తరలించే ప్రణాళికతో ఇండోనేషియా ముందుకు వస్తోంది. అయితే, రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన స్థానాన్ని ఇంకా ఆ దేశం వెల్లడించలేదు. కానీ, అధ్యక్షుడు జోకో విడోడో రాజధాని మార్పుకు సంబంధించిన పథకాన్నిఆగస్టు 16వ తేదీన పార్లమెంట్‌లో ప్రారంభించారు.
 
రాజధాని మార్పుకు గల కారణం ఏంటో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. జకర్తా ఏటా సగటున 1 నుంచి 15 సెంటీ మీటర్లు మునిగిపోతోంది. ఇప్పటికే సగం నగరం సముద్రమట్టం స్థాయికి వచ్చింది. ట్రాఫిక్ సమస్య మరో కారణం.
 
2016లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఉన్న ప్రాంతంగా జకర్తా మొదటి స్థానంలో నిలిచింది. మంత్రులు సమావేశాలకు సకాలంలో చేరడానికి కూడా పోలీసుల కాన్వాయ్ సాయం తీసుకోవాల్సి వస్తోంది. ఈ ట్రాఫిక్ సమస్య కారణంగా ఇండోనేసియా ఆర్థికరంగంపై ఏడాదికి 1.47 వేల కోట్ల రూపాయల భారం పడుతోందని ప్రణాళికా శాఖ మంత్రి అన్నారు.
 
కాలిమంటన్‌ కొత్త రాజధాని కాబోతోంది. కొత్త రాజధాని నిర్మాణానికి 24 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. దాదాపు 15 లక్షల మంది నివసించేందుకు వీలుగా 30 నుంచి 40 వేల హెక్టార్ల భూమి అవసరం అవుతుంది.
 
కాలిమంటన్‌లోని పాలంగ్కరయ ప్రధాన రాజధాని ప్రాంతం. ఇది భౌగోళికంగా ఇండోనేషియా ద్వీపసమూహానికి దగ్గరగా ఉంటుంది. గతంలో ఇండోనేషియా జాతిపిత సుకర్నో కూడా దీన్నే రాజధానిగా ప్రతిపాదించారు. అయితే, ఇలా రాజధాని మార్చడంలో ఇండోనేషియానే మొదటిదికాదు గతంలోనూ అనేక దేశాలు తమ రాజధానులను మార్చాయి.
 
కజక్‌స్థాన్ 
దేశ అధ్యక్షుడు నుర్ సుల్తాన్ నజర్ బయోవ్ 1997లో రాజధానిని ప్రధాన నగరం అల్మటీ నుంచి తరలించాలని నిర్ణయించారు. దేశానికి ఉత్తరం వైపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. తర్వాత ఆ పట్టణానికి ఉన్న అక్వ్మోలా పేరును ఆస్థానాగా మార్చారు.
 
రాజధాని నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లను రప్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెంట్‌గా పిలిచే ఖాన్ షాటిర్ కొత్త రాజధానిలో నిర్మించారు. నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఈ భవనంలో ఇండోర్ షాపింగ్ మాల్, ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.
 
చమురు మార్కెట్ వల్లే ఆ దేశం ఇలా రాజధానిని భారీగా నిర్మించగలిగింది. రాజధాని మార్పు తర్వాత ఆ దేశ వృద్ధి రేటు 2018లో 4.8 శాతానికి పెరిగింది. మార్చిలో అధ్యక్షుడు నూర్ సుల్తాన్ పదవి నుంచి తప్పుకున్నాక ఆయన గౌరవార్థం రాజధానికి ఆయన పేరును ఖరారు చేశారు. ఇప్పుడు కజక్‌స్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ నగరం ప్రపంచంలోనే రెండో శీతల ప్రాంతంగా (మొదటిది మంగోలియాలోని ఉలాన్ బాటర్) నిలిచింది.
 
మయన్మార్ 
మయన్మార్ కొత్త రాజధాని నేపీడా విస్తీర్ణంలో లండన్‌ కంటే నాలుగు రెట్లు పెద్దది. కానీ, జనాభా మాత్రం తక్కువ. నేపీడా అంటే రాజు కూర్చున్న స్థలం అని అర్థం. ఈ రాజధాని చరిత్ర చాలా చిన్నది. 2005లో ఇది మయన్మార్ రాజధానిగా మారింది. గతంలో మయన్మార్(బర్మా) రాజధానిగా యాంగాన్ ఉండేది. 
 
అయితే, రెండో ఇరాక్ యుద్ధం ప్రారంభానికి ముందు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న తమ దేశ రాజధానిపై విదేశీ దళాలు సులువుగా దాడికి పాల్పడే అవకాశం ఉందని మయన్మార్ ఆర్మీ అధికారులు భావించారు. దాంతో దూరంగా కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించారు. నగర నిర్మాణం పూర్తయి దాదాపు 15 ఏళ్ల గడిచింది. 2006 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అన్ని మంత్రిత్వ శాఖల భవనాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయి.
 
ఈ నగరంలోకి అడుగుపెట్టగానే అత్యద్భుతంగా తీర్చిదిద్దిన 20 వరుసల రహదారులు, వందకుపైగా విలాసవంతమైన హోటళ్లు స్వాగతం పలుకుతాయి. కానీ, ఎక్కడా జనాలు పెద్దగా కనిపించరు. ట్రాఫిక్ సమస్యే లేదు. షాపింగ్ మాల్స్ ఖాళీగా దర్శనమిస్తాయి. ఇక్కడ సఫారీ పార్క్, జూ, మూడు స్టేడియంలు ఉన్నాయి. దేశం మొత్తం మీద 24 గంటలు కరెంట్ సరఫరా ఉన్న ప్రాంతం కూడా ఇదే.
 
బొలీవియా 
బొలీవియాకు రెండు రాజధాని నగరాలు ఉన్నాయి. అవి సుక్రీ, లా పాజ్. 1899 వరకు సుక్రీ రాజధానిగా ఉండేది. ఒక చిన్న అంతర్యుద్ధం తర్వాత రాజధాని ప్రాంతం లా పాజ్‌కు మారంది. ఇప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుక్రీలోనే ఉంది. దేశానికి మధ్య భాగంలో సుక్రీ ఉంటుంది. ఈ ప్రాంత జనాభా రెండున్నర లక్షల వరకు ఉంటుంది. అదే లాపాజ్ జనాభా దాదాపు 17 లక్షల వరకు ఉంది.
 
అయితే, 2007లో లాపాజ్‌లో భారీ నిరసన కార్యక్రమం జరగడంతో పార్లమెంట్, ప్రభుత్వ సంస్థలను తిరిగి సుక్రీకు తరలించాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. బొలీవియాలోని వెనకబడ్డ పశ్చిమ పర్వత ప్రాంతంలోని అధ్యక్షుడు ఎవో మోరల్స్ మద్దతుదారులు, సంపన్న తూర్పు తీరంలోని అతని ప్రత్యర్థుల మధ్య ప్రాంతీయ వైరం కారణంగా రాజధాని మార్పు ఆలోచన తలెత్తింది. చివరకు ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం బొలీవియాకు రెండు రాజధానులు ఉన్నాయి.
 
నైజీరియా 
1991 వరకు నైజీరియాలో అతిపెద్ద పట్టణం లాగోస్. ఇదే ఆ దేశ రాజధాని కూడా. అయితే, రాజధానిని లాగోస్ నుంచి అబుజాకు మార్చడానికి అనేక కారణాలున్నాయి. ఇది దేశానికి మధ్య భాగంలో ఉండటం ఒక ప్రధాన కారణం. మరోవైపు లాగోస్ చాలా ఇరుకుగా మారింది( సహారా ప్రాంతంలో ఇదే అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం). రాజధాని తరలింపునకు ఇదీ ఒక కారణమే.
 
లాగోస్‌తో పోల్చితే అబుజా రాజకీయంగా, జాతుల పరంగా చాలా తటస్థంగా ఉన్న ప్రాంతం. లాగోస్‌లో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అదే అబుజాలో విశాలమైన రోడ్లు ఉండటంతో ఈ సమస్య లేదు. అయితే, ఇప్పటికీ జాతీయ సాంస్కృతిక సంస్థలు, సుప్రీంకోర్టు, జాతీయ అసెంబ్లీ, అధ్యక్ష భవనం, అనేక ఫెడరల్ ఏజెన్సీలు లాగోస్‌లోనే ఉన్నాయి.
 
పోర్చుగల్ 
పోర్చుగల్ రాజధానిగా దాదాపు 13 ఏళ్ల పాటు రియో డీ జనీరో కాకుండా లిస్బన్ ఉంది. దీనికి కారణం నెపోలియన్ చేసిన దండయాత్రలు. 1807 నుంచి 1814 వరకు జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ మూడు సార్లు పోర్చుగల్‌పై దాడి చేసింది. 1807 డిసెంబర్‌లో దండయాత్రకు కొన్ని రోజుల ముందు బ్రాగన్జా రాజకుటుంబం బ్రెజిల్‌కు వెళ్లింది. కోర్టును కూడా ఇక్కడికే మార్చారు.
 
19 వ శతాబ్దం ప్రారంభంలో రియో అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉండేది. బంగారం, వజ్రాలు, చక్కెరకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. బానిసలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. రాజప్రతినిధి డోమ్ జొయో 6 పోర్చుగల్, బ్రెజిల్, అల్రేవ్స్‌ను ఏర్పాటు చేశారు.
 
బ్రాగన్జా రాణి 1816లో మరణించడంతో డోమ్ జొయో రాజు అయ్యారు. 1821లో పోర్చుగీస్ కోర్టును తిరిగి లిస్బన్‌కు తరలించారు. 1910లో నియంతృత్వ పాలన ముగిసే వరకు కోర్టు అక్కడే ఉంది. రియో రాజధానిగా ఉన్నప్పుడు బ్రెజిల్‌పై ఈ నగరం చెరగని ముద్ర వేసింది. ఆర్థికవ్యవస్థకు ఊతం ఇచ్చింది. దేశ స్వాతంత్య్రానికి సహాయపడింది.