శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (13:44 IST)

సమ్మెను విరమించుకున్న బ్యాంకు ఉద్యోగులు - సేవలు యధాతథం

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 26, 27వ తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలిగుతాయని భావించారు. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత ఈ సమ్మెను ఉంపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
బ్యాంకుల విలీనం నేపథ్యంలో తాము ఆవేదన చెందుతున్న అంశాలపై సమగ్ర విశ్లేషణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదిత రెండు రోజుల సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. 
 
మొత్తం 10 బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్లు ఈ నెల 26, 27వ తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. 
 
విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటుగా ఉద్యోగుల వేతనాలను సవరించాలని, పెన్షన్లను పెంచాలని బ్యాంక్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లన్నింటిని విశ్లేషించడానికి కేంద్రం చొరవ తీసుకోవడంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. దీంతో బ్యాంకు సేవలు యధాలాపంగా సాగనున్నాయి.