శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:17 IST)

గాడినపడుతున్న ఆర్థిక వ్యవస్థ : కేంద్ర విత్తమంత్రి గోయల్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇపుడు క్రమంగా పుంజుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థికవ్యవస్థ తిరిగి కోలుకుంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. 
 
గత నెలలో ఎగుమతులు మంచి వృద్ధిని కనబరిచాయని గోయల్ చెప్పారు. 2019 జూలైలో నమోదైన ఎగుమతుల్లో 91శాతానికి చేరుకున్నట్లు వెల్లడించారు. దిగుమతులు 70 శాతం నమోదయ్యాయన్నారు. విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత పారిశ్రామికరంగంలో నమ్మకం ఏర్పడిందన్నారు. ఇది మరింత వృద్ధికి సహకరిస్తుందన్నారు.
 
పెట్రోలియం, టెక్స్‌టైల్ రంగాలలో మందగమనం కారణంగా జూన్ వరకు వరుసగా నాలుగు నెలలు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయన్నారు. వాణిజ్యంలో మిగులు నమోదయిందని గోయల్ చెప్పారు. జూన్ నెలలో 790 మిలియన్ డాలర్ల ట్రేడ్ సర్‌ప్లస్ నమోదయిందన్నారు. 18 ఏళ్లలో ఇలా మిగులు ఉండటం తొలిసారి అన్నారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా చమురుకు డిమాండ్ లేకపోవడం, పసిడి దిగుమతులు తగ్గడం, ఇతర ఇండస్ట్రియల్ ఉత్పత్తులు తగ్గడం వంటి వివిధ కారణాలతో దిగుమతులు తగ్గినట్లు చెప్పారు. తయారీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఇందుకు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు.
 
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయని, ఎగుమతుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందన్నారు. ఎగుమతుల్లో గతంలో కంటే క్షీణత ఉన్నప్పటికీ ఆ రేటు తగ్గుతూ వస్తోందన్నారు. ఏప్రిల్ నెలలో మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మే నెలలో 34.47 శాతం, జూన్ నెలలో 12.41 శాతంగా ఉందన్నారు. జూలైలో అయితే గత ఏడాదితో పోలిస్తే 91 శాతానికి ఎగుమతుల పరిమాణం పెరిగిందన్నారు. దిగుమతులు 70 శాతం నుండి 71 శాతంగా ఉన్నట్లు తెలిపారు.