1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:08 IST)

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం : ఉచితంగా ఫాస్టాగ్‌ల పంపిణీ

ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయని వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్చి ఒకటో తేదీ వరకు ఉచితంగానే ఫాస్టాగ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టోల్ ప్లాజాల వద్దే కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. అలాగే, ఫాస్టాగ్‌ ఆఫ్‌లైన్‌ రీచార్జ్‌ కోసం టోల్‌ప్లాజాల వద్ద 40 వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీవోఎస్‌) యంత్రాలను అందుబాటులో పెట్టినట్లు వెల్లడించింది.
 
ప్రస్తుతం ఫాస్టాగ్‌ ధర రూ.100గా ఉంది. మార్చి 1వ తేదీ వరకు 770 టోల్‌ప్లాజాల వద్ద బ్యాంకులు ఉచితంగా ఫాస్టాగ్‌ను అందజేస్తాయి. బ్యాలెన్స్‌ రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. ఫాస్టాగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 
 
కాగా.. ఈ నెల 16వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ నిబంధన అమల్లోకి వచ్చింది. తొలి రెండు రోజుల్లో 87 శాతం వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ద్వారా చెల్లింపులు జరిపాయని వెల్లడించింది. 60 లక్షల ట్రిప్పులకు ఫాస్టాగ్‌ ద్వారా రూ.95 కోట్ల మేర వసూళ్లు జరిగాయని పేర్కొంది. 
 
దేశ వ్యాప్తంగా 100 టోల్‌ప్లాజాల వద్ద 90 శాతం వాహనాలు ఫాస్టాగ్‌తో వెళ్లాయని వివరించింది. మైఫాస్టాగ్‌ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. వాహనం నంబరును నమోదు చేయగానే నగదు నిల్వల వివరాలు తెలుసుకోవచ్చని వివరించింది. 
 
నగదు నిల్వలు ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో ఉంటాయని తెలిపింది. ఆకుపచ్చ రంగు ఉంటే తగినన్ని నిల్వలు ఉన్నాయని, కాషాయం రంగు ఉంటే నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎరుపు రంగులో ఉంటే బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది.