శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 13 మే 2021 (18:41 IST)

తెలుగు రాష్ట్రాల్లో జియో 3.16 కోట్ల కస్టమర్లతో నెంబర్ వన్: కొత్తగా 1.48 లక్షలకు పైగా చందాదారులు

ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో గడచిన ఫిబ్రవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందాదారులను జత చేసింది. 

దీంతో ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో జియో తన మార్కెట్ నాయకత్వాన్ని సుస్థిరం చేసుకుంది. ఫిబ్రవరి నాటికి 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది.
 
ట్రాయ్ ప్రచురించిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి లో జియో అత్యధికంగా 1,48,278 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. తరువాతి స్థానంలో ఎయిర్టెల్ 72,559 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా 1,90,341 మంది సభ్యులను, బీఎస్ఎన్ఎల్ 7880 మంది కస్టమర్లను కోల్పోయాయి.
 
దేశవ్యాప్తంగా జియో అత్యధికంగా 42.66 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చింది. ఎయిర్టెల్ 37.3 లక్షలు జోడించగా, వోడాఫోన్ ఐడియా 6.5 లక్షల మంది సభ్యులను చేర్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ 3.6 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2021 లో దేశంలో మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య 82,92,668కు పెరిగింది.
 
4 జి డౌన్‌లోడ్ వేగంలో జియో టాప్
డేటా డౌన్‌లోడ్ స్పీడ్ లోను రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ లో ఉంది. జియో తన సమీప పోటీదారు వోడాఫోన్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ డౌన్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది.
 
మే 11 న అప్‌డేట్ చేసిన ట్రాయ్ డేటా ప్రకారం వోడాఫోన్ ఏప్రిల్‌లో 7 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఐడియా మరియు ఎయిర్టెల్  తరువాత వరుసగా 5.8 ఎమ్‌బిపిఎస్ మరియు 5 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగంతో ఉన్నాయి.
 
నెట్‌వర్క్ అప్‌లోడ్ విభాగంలో 6.7 ఎమ్‌బిపిఎస్‌ వేగంతో వోడాఫోన్  అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత ఐడియా 6.1 ఎమ్‌బిపిఎస్,  జియో 4.2 ఎమ్‌బిపిఎస్ మరియు ఎయిర్టెల్ 3.9 ఎమ్‌బిపిఎస్ వేగాన్ని నమోదు చేసాయి.