1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (16:02 IST)

భారత్ బయోటెక్ ఉద్యోగులు 50మందికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ పనిచేయలేదా?

Bharat biotech
భారత్ బయోటెక్ పరీక్షలో 50 మంది ఉద్యోగులు కరోనా  బారిన పడ్డారు. కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తమ సంస్థ భారత బయోటెక్‌కు చెందిన 50 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
 
భారత బయోటెక్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ రావడంపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది కోవాక్సిన్ యాంటీ-కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని ప్రశ్నించగా, మరికొందరు సిబ్బందికి ఎందుకు టీకాలు వేయలేదని ప్రశ్నించారు.  
 
కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ సరఫరా సమస్యలపై కొందరు రాజకీయ నాయకుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "కొన్ని రాష్ట్రాలు తమ సంస్థపై ఫిర్యాదు చేయడాన్ని వినడానికి చాలా నిరుత్సాహపరుస్తుంది. మా ఉద్యోగులలో 50 మంది కోవిడ్ కారణంగా పనిలో లేరు, అయినప్పటికీ మేము విధులను కొనసాగిస్తున్నాము. లాక్ డౌన్‌లో పనిచేస్తున్నాం.. అంటూ సుచిత్రా ఎల్లా ట్వీట్ చేశారు. 18 రాష్ట్రాలకు కోవాక్సిన్ లభించిందని ఎల్లా చెప్పారు. 
 
ఆమె ట్వీట్‌పై స్పందిస్తూ, ఒక నెటిజన్ ఇలా వ్రాశాడు, "మీ 50 మంది ఉద్యోగులకు కోవిడ్‌ ఎలా వచ్చింది? వారికి టీకాలు వేయలేదా? అలాగే, తాత్కాలిక ప్రాతిపదికన ఎక్కువ మందిని ఎందుకు నియమించకూడదు?" అంటూ ప్రశ్నించాడు. 
 
ఇక భారత బయోటెక్ ఎండీ ఎల్లా యొక్క ట్వీట్‌కు 9,373 లైక్‌లు వచ్చాయి. "భారత్ బయోటెక్ మీ కృషికి మరియు భారతదేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో నిబద్ధతకు ధన్యవాదాలు" అని మరో ట్విట్టర్ యూజర్ చెప్పారు. 
 
ఇకపోతే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, ఢిల్లీతో సహా 18 రాష్ట్రాలకు కోవాక్సిన్ సరఫరా చేస్తోంది. 
 
ఇతర రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు కూడా ఈ వ్యాక్సిన్ సరఫరా కొనసాగుతోంది.