గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:06 IST)

వ్యాక్సిన ధరలు తగ్గించాలి : ఉత్పత్తి సంస్థలను కోరిన కేంద్రం

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి నిత్యం మూడున్నర లక్షల మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. రెండు వేలకు మంది వరకు చనిపోతున్నారు. ఈ తరుణంలో వ్యాక్సిన్ ధరలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ  భారీ వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను తగ్గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌యారీ సంస్ధ‌లు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్ సంస్థల‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది. 
 
ఈ మేరకు సోమవార అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్ర ప్రభుతానికి ఒకతీరుగా.. రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు మరో తీరుగా ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ధరల వ్యత్యాసంపై కేంద్రంపై పలువురు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తరుణంలో.. పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌హా ప‌లు రాష్ట్రాల సీఎంలు వ్యాక్సిన్ ధ‌ర‌ల్లో అస‌మాన‌త‌ల‌ను ప్ర‌శ్నించారు. 
 
దీంతో ధ‌ర‌లను తగ్గించాలని కేంద్రం వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల‌ను కోరింది. ప్ర‌స్తుతం భార‌త్ బ‌యోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్‌ను రాష్ట్రాల‌కు డోస్‌కు రూ.600 చొప్పున‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ.1200కు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యాక్సిన్ డోస్‌ను రూ.150కే స‌ర‌ఫ‌రా చేస్తోంది. 
 
అలాగే, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ ధ‌ర‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు ఒక్కో డోస్‌కు రూ.400గా నిర్ణ‌యించ‌గా ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ.600కు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే.. ఈ ధ‌ర‌ల వ్య‌త్యాసం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు విపక్ష పార్టీల నేతల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వ్యాక్సిన్ ధ‌ర‌లను తగ్గించాల‌ని వ్యాక్సిన్ త‌యారీ సంస్ధ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. 
 
అయితే, కేంద్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌నపై సీరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భార‌త్ బ‌యోటెక్ స్పంద‌న ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. జనవరి 16 నుంచి సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 14.19 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించి 100 రోజులైనట్టు వెల్లడించింది.