శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (08:35 IST)

పెట్రో ధరలపై పోలింగ్‌కు ముందు ఓ మాట.. పోలింగ్ వేళ మరోమాట..

దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం పూటకో మాట మాట్లాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర పెరిగిపోతోందని, అందువల్ల దేశీయంగా కూడా పెట్రోల్ ధరల భారాన్ని వినియోగదారులు భరించాల్సిందేనంటూ పదేపదే చెబుతూ వచ్చిన కేంద్ర మంత్రులు ఇపుడు మాట మార్చారు. 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఈ పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోల్ ధరలపై వ్యాఖ్యానించారు. ఈయనగారే.. ఇటీవల మాట్లాడుతూ, పెట్రోల్ ధరల భారాన్ని వినియోగదారులు భరించాల్సిందేనంటూ సెలవించారు. ఇంతలోనే మాటమార్చి.. ఇపుడు త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గుతాయని చెప్పడం ఆయనకే చెల్లుతుందనే విమర్శలు లేకపోలేదు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రేట్లను తగ్గించడం ప్రారంభించాయని, సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింతగా తగ్గుతాయన్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికలు జరుగుతున్న వేళ, కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన్, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయని, ఆ ప్రభావం దేశీయంగా కూడా ఉంటుందన్నారు. 
 
కాగా, ఫిబ్రవరి 27న ఎలక్షన్ కమిషన్ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగానే, పెట్రోలు ధరల పెరుగుదలకు బ్రేక్ పడిన సంగతితెలిసిందే. ఆ తర్వాత చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై 61 పైసలు, డీజిల్ పై 60 పైసల మేరకు ధరను తగ్గించాయి. దాని తర్వాత 14.2 కేజీల వంట గ్యాస్ ధరను రూ.10 మేర తగ్గించిన సంగతి తెలిసిందే.
 
"గత కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం ప్రారంభించాయి. మేము ఈ విషయాన్ని ముందే వెల్లడించాం. ఇంటర్నేషనల్ మార్కెట్ ను అనుసరించి ధరలు మారుతుంటాయి. ధరలు తగ్గే కొద్దీ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తాం. వంట గ్యాస్ ధరలు కూడా రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతాయి" అని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికలు వచ్చినందునే ఓట్ల కోసం బీజేపీ ప్రభుత్వం ధరలను తాత్కాలికంగా తగ్గిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.