1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (15:27 IST)

వినియోగదారులకు ఎస్.బి.ఐ షాక్... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి...

cards
తమ బ్యాంకు ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) షాకిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డెబిట్ కార్డు చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ పెంచిన చార్జీల వివరాలను పరిశీలిస్తే, డెబిట్ కార్డు కలిగిన ప్రతి ఖాతాదారుడి నుంచి గరిష్టంగా రూ.75 (జీఎస్టీ అదనం) వరకు పెంచింది. కొత్త చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
ఎస్.బి.ఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్టీ అదనం) వసూలు చేస్తుంది. దీన్ని రూ.200 వరకు పెంచేసింది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ఇపుడు రూ.175 మేరకు చార్జీ వసూలు చేస్తుండగా, దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని రూ.250కి పెంచింది. అలాగే ప్లాటినం డెబిట్ కార్డు చార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ఫ్రెడ్, ప్రీమియర్ బిజినెస్ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ చార్జీలను వసూలు చేస్తుండగా, దాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.425కు పెంచింది. ఈ కొత్త చార్జీలన్నింటికీ జీఎస్టీ పన్ను అదనం.