మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (08:28 IST)

జీఎస్టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు.. మరోమారు రూ.లక్ష కోట్లు క్రాస్

దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నాయ. వరుసగా రెండో నెలలో కూడా లక్ష కోట్ల రూపాయలు క్రాస్ అయ్యాయి. ఆగస్టు నెలలో మొత్తం 1.12 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
జులై నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకుపైగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ మొత్తం 86,449 కోట్ల రూపాయలుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 30 శాతం పెరిగాయి. 
 
ఇక ఈ ఏడాది వసూలైన రూ.1,12,020 కోట్లలో కేంద్ర జీఎస్టీ రూ.20,522 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.26,605 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
అయితే, జులైతో పోలిస్తే ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు కొద్దిగా తగ్గాయని పేర్కొంది. జులై నెలలో రూ.1.16 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైన సంగతి తెలిసిందే. ఆగస్టులో ఇది రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే. 
 
గత అక్టోబరు నుంచి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల పైగానే ఉంటూ వచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెలలో ఈ వసూళ్లు రూ. 92,849 కోట్లకు పడిపోయాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.