1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జులై 2023 (22:43 IST)

ఆఫీస్ డిమాండ్‌లో సింహభాగం ఆక్రమిస్తున్న దక్షిణాది నగరాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై

charminar
జూన్‌తో ముగిసిన త్రైమాసంలో టాప్ 7 నగరాల్లోని మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో 59 శాతం వాటాతో భారతదేశంలోని మూడు కీలక దక్షిణాది నగరాలు- బెంగళూరు, చెన్నై, హైదరాబాద్- ఆఫీస్ డిమాండ్‌లో ఆధిపత్యం చెలాయించాయని వెస్టియన్ తెలిపింది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తన త్రైమాసిక ఆఫీస్ మార్కెట్ నివేదిక 'ది కనెక్ట్ క్యూ2 2023ని విడుదల చేసింది. డేటా ప్రకారం, ఈ క్యాలెండర్ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసంలో మొత్తం 13.9 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ స్వీకరణలో మూడు ప్రధాన దక్షిణాది నగరాల్లో సంయుక్త ఆఫీసు లీజింగ్ వాటా 8.2 మిలియన్ చదరపు అడుగుల వద్ద ఉంది.
 
ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, MNCలు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా ఏడు ప్రధాన నగరాల్లో, ఆఫీస్ లీజింగ్ ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 14.8 మిలియన్ చదరపు అడుగుల నుండి 6 శాతం తగ్గి 13.9 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. అయితే, గత త్రైమాసంతో పోలిస్తే డిమాండ్ 17 శాతం పెరిగింది.
 
వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు కనబరిచింది. FY23 చివరి త్రైమాసంలో భారతదేశ GDP వృద్ధి రేటు మెరుగుపడింది. ఆర్థిక మార్కెట్లు కూడా మంచి పనితీరును కనబరిచాయి, ఇది దేశంలో సానుకూల సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. గత త్రైమాసంతో పోలిస్తే జూన్ త్రైమాసంలో స్వీకరణ, నూతన నిర్మాణాలు అందుబాటులోకి రావటం గణనీయంగా పెరిగాయని రావు పేర్కొన్నారు.
 
టెక్నాలజీ రంగం లీజింగ్ కార్యకలాపాలలో ఆధిపత్యం చెలాయించిందని, ఇంజినీరింగ్, తయారీ తర్వాత, మార్కెట్ అనిశ్చితి మధ్య జాగ్రత్తగా లీజింగ్ నిర్ణయాల కారణంగా ఫ్లెక్సిబుల్ స్పేస్‌లు కూడా పట్టు సాధించాయని ఆయన వెల్లడించారు. "గ్లోబల్ మార్కెట్లు స్థిరంగా ఉన్నందున, సంవత్సరం ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది" అని రావు చెప్పారు.