శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (16:23 IST)

జనసేన చెన్నై విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన ఆరోగ్య శిబిరం

pawan kalyan
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబరు 2వ తేదీ)ను పురస్కరించుకుని సెప్టెంబరు 1వ తేదీన జనసేన పార్టీ చెన్నై విభాగం ఆధ్వర్యంలో "మెగా హెల్త్ క్యాంపు - బ్లడ్ డొనేషన్ డ్రైవ్" జరుగనుంది. స్థానిక టి.నగర్‌లోని ఆంధ్రా క్లబ్‌లోని గోదావరి హాలులో ఈ మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిర కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగే ఈ మెగా శిబిరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. 
 
రక్తదాన శిబిరంలో ఆసక్తిగల వారు పాల్గొని రక్తదానం చేయొచ్చు. ఆరోగ్య శిబిరంలో నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన పలు విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయడమేకాకుండా, తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. అందువల్ల ఈ ఆరోగ్య శిబిరాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని జనసేన పార్టీ చెన్నై విభాగం కన్వీనకర్ తమ్మయ్య నాయుడు ఓ పత్రికా ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కోసం 98402 82445 అనే నంబరులో సంప్రదించవచ్చు.