1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (17:33 IST)

రిపబ్లిక్ డే వేడుకలు.. కవాతులో పాల్గొన్న 150 మంది సైనికులకు పాజిటివ్

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో  వచ్చే ఏడాది జనవరి 26న రాజ్‌పథ్‌లో కవాతు నిర్వహించడానికి ప్రణాళికలు కొనసాగుతున్నాయి. యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను ముఖ్యఅతిథిగా భారత్ ఆహ్వానించింది. బ్రిటన్‌లో కొత్త వైరస్ భయం ఉన్నప్పటికీ బ్రిటిష్ ప్రధాని సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. 
 
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత గణతంత్ర దినోత్సవం ఈసారి సాదాసీదాగా పూర్తిచేయనున్నారు. ఇప్పటికే పరేడ్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన 150 మంది సైనికులు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వివిధ కవాతుల్లో పాల్గొనేందుకు  వచ్చిన సైనికులను సేఫ్‌ బబుల్‌లో వేయడానికి ముందు పరీక్షించారు. వీరిలో కొందరికి పాజిటివ్‌గా తేలింది. 
 
అయితే కోవిడ్‌-19కు సంబంధించిన అన్ని లక్షణాలు లేనప్పటికీ వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌లో నిర్భంధంలో ఉంచాలని సైనికాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరేడ్‌కు హాజరవుతున్న పెద్ద సంఖ్యలోని సైనికుల్లో 150 మందికి కరోనా పాజిటివ్‌ రావడం పట్ల అధికారులు భయం వ్యక్తం చేస్తున్నారు.
 
రిపబ్లిక్‌ డే కవాతును సురక్షితంగా నిర్వహించడానికి ప్రోటోకాల్స్ ఉంచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వార్షిక గణతంత్ర దినోత్సవంతో పాటు ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొనడానికి ప్రతి ఏటా వేలాది మంది సైనికులు దేశ రాజధానికి వస్తుంటారు.