1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (14:09 IST)

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీనికి నిదర్శనమే ఆ రాష్ట్రానికి చెందిన అనేకి రాజకీయ ప్రముఖులకు వరుసగా కరోనా వైరస్ బారినపడుతుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గత 24 గంటల వ్యవధిలో అనేక రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. 
 
వీరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ సీనియర నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇలా అనేక మంది ఉన్నారు. ఇపుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. పైగా, తనను కలవడానికి ఎవరూ రావొద్దని, తనతో కాంటాక్ట్ అయినవారు విధిగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
 
చంద్రబాబుకు పాజిటివ్ 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాను కోవిడ్ బారినపడినట్టు బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. అలాగే, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
కాగా, చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా కారంచేడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంతిమ యాత్రలో పాల్గొని పాడె కూడా మోసారు. అలాగే, మరికొన్ని ప్రజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించి, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. 
 
దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ 
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. "వైద్యుల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా తనను కలిసివారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు.