1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (15:01 IST)

ఆశలు రేపుతున్న 'కరోనా' యాంటీ వైరల్ మెడిసిన్ ... చికాగోలో రోగులకు చికిత్స?!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ కనిపెట్టింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే చికాగాలోని కరోనా రోగులపై ప్రయోగించారు. మొత్తం 113 మంది రోగులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా వారంతా కేవలం వారం రోజుల్లో పూర్తిగా కోలుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. అయితే, మరికొన్ని దశల్లో ప్రయోగాలు, పరీక్షలు చేయాల్సివున్నందున మే మొదటివారంలో ఈ వ్యాక్సిన్‌పై అధికారికంగా ప్రకటన చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఇంతకీ కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ కనిపెట్టిన కంపెనీ పేరు గిలియెడ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ. అమెరికాలో మందుల తయారీ కంపెనీల్లో ఇదొకటి. ఈ కంపెనీ కరోనా రోగాన్ని నయం చేసేందుకు ఓ చికిత్సా విధానాన్ని కనిపెట్టింది. 
 
మూడో దశలో ఉన్న కరోనా పాజిటివ్ రోగులపై ఈ కంపెనీ జరిపిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఇపుడు అందరి దృష్టి ఈ కంపెనీ మందుపై కేంద్రీకృతమైంది. అయితే, దీనిపై ఆ సంస్థ మరిన్ని పరిశోధనలు చేస్తోంది. ఓ చికిత్స పద్ధతిని అమెరికాలోని కరోనా రోగులపై ఆ సంస్థ ప్రయోగించగా వారిలో అత్యధిక మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
 
ఆ చికిత్సా విధానంతో కొవిడ్‌-19 రోగులకు జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు అతి వేగంగా తగ్గాయి. రోగులు త్వరితగతిన కోలుకుంటున్నారు. ఈ చికిత్స పద్ధతిలో చికిత్స తీసుకున్న వారంతా వారం రోజుల లోపే కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటికి తాము చేసిన ప్రయోగ పరీక్షలను మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 
 
ముఖ్యంగా, కరోనాతో అధికంగా ఉన్న స్టేజ్‌-3 రోగులపై చేసిన ప్రయోగ పరీక్షల ఫలితాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పింది. ఈ వివరాలన్నీ మే మొదటి వారంలో వస్తాయని, ఆ తర్వాతే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పూర్తిగా అధ్యయనం చేసేంతవరకు ఈ చికిత్స పనిచేస్తుందని ప్రకటన చేయలేమని ఆ సంస్థ తెలిపింది. 
 
తమ చికిత్సకు మంచి స్పందన వస్తూ పెద్ద సంఖ్యలో అతి త్వరగా రోగులు కోలుకుంటుండంతో గిలియెడ్‌ అమెరికాలోని 152 ప్రాంతాల్లో ప్రయోగ పరీక్షలు జరుపుతోంది. చికాగో వర్సిటీ ఆసుపత్రిలోనూ ఈ ప్రయోగ పరీక్షలు జరుపుతోంది. ఇప్పటికే 113 మందిని ప్రయోగ పరీక్షల కోసం ఆ ఆసుపత్రిలో చేరగా, వారందరికీ కరోనా పూర్తిగా తగ్గిపోయింది. 
 
చికాగోలో పెద్ద ఎత్తున రోగులు కోలుకోవడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఆ సంస్థ పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రపంచంలోని మార్కెట్లన్నీ దానివైపే చూస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లోనూ ఆ సంస్థ షేర్లు భారీగా పెరిగిపోతున్నాయి.