శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (07:20 IST)

కరోనా డబుల్ డేంజర్ : ఉత్పరివర్తనం చెందిన కరోనా

దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. రెండో దశ వ్యాప్తి తీవ్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్‌ రకాలు (స్ట్రెయిన్లు) మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రెట్టింపు స్థాయిలో ఉత్పరివర్తనం చెందిన కొత్త వైరస్‌ను (న్యూ డబుల్‌ మ్యూటెంట్‌ వేరియెంట్‌ను) మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తాజాగా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. 
 
అలాగే, 18 రాష్ట్రాల్లో ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్న కొత్తరకం వైరస్‌ రకాలను గుర్తించినట్టు వివరించింది. ఇందులో కొన్ని స్ట్రెయిన్లు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో గుర్తించిన వైరస్‌ రకానికి చెందినవని, వాటి తీవ్రత ఆందోళన కలిగిస్తున్నదన్నది. అయితే, ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులకు ఈ కొత్త రకం వైరస్‌లే కారణమని ఇప్పుడే చెప్పలేమని వివరించింది.
 
ఉత్పరివర్తనం చెందిన రెండు కొత్త రకం కరోనా వైరస్‌ రకాలు కలిసి మూడో రకం వైరస్‌గా ఏర్పడటాన్ని ‘వైరస్‌ రెట్టింపు ఉత్పరివర్తనం (డబుల్‌ మ్యుటేషన్‌)’ అంటారని హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. 
 
భారత్‌లో తాజాగా గుర్తించిన డబుల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ స్ట్రెయిన్ల కలయికతో ఏర్పడినట్టు అభిప్రాయపడ్డారు. డబుల్‌ మ్యుటేషన్‌కు లోనైన వైరస్‌ శరీరంలోని యాంటీబాడీలను ఎదుర్కోగలదన్నారు. 
 
అలాగే వ్యాక్సిన్‌ నుంచి కూడా తనను తాను రక్షించుకోగలదన్నారు. అయితే, ఎలాంటి స్ట్రెయిన్లు కలిసి డబుల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ ఏర్పడిందన్న వానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటేనే దీని నుంచి బయటపడగలమన్నారు.