శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:35 IST)

పెరుగుతున్న కరోనా రోగుల మరణాలు... తమిళనాడులో ఏం జరుగుతోంది?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రెండు దశలుగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 51 మంది చనిపోయారు. 
 
వీరిలో సగానికిపైగా అంటే.. 27 మంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అలాగే, గుజరాత్‌కు చెందిన వారు 11 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఏడుగురు ఉండగా, రాజస్థాన్‌లో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు పెరిగింది.
 
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం నాటికి దేశ వ్యాప్తంగా 29,974 వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం మరణాల సంఖ్య 5.75 శాతం, కోలుకున్న వారి సంఖ్య 10.45 శాతం పెరిగాయి. మొత్తం బాధితుల్లో 3.12 శాతం మంది మృత్యువాత పడగా, 23.44 శాతం మంది కోలుకున్నారు. గత రెండు రోజులుగా కేసుల పెరుగుదల 5.4, 5.6 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి మరింత విషమంగా ఉంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, అనేక మంది చిన్నారులు ఈ వైరస్ బారినపడటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,058 మంది కరోనా బారినపడగా, వారిలో 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు 121 మంది వరకు ఉన్నారన్నదే ఆ వార్త. నిజానికి చిన్నారులపై వైరస్ ప్రభావం అంతగా ఉండదన్న వార్తలు ఇటీవల వినిపించాయి.
 
అయితే, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా 121 మంది చిన్నారులకు వైరస్ సంక్రమించడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 1,392 మంది పురుషులు కాగా, 666 మంది మహిళలు ఉన్నారు. గత 24 గంటల్లో చెన్నైలో 103 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 673కి పెరిగింది.