మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (17:42 IST)

పబ్లిసిటీ కోసం దుబాయ్‌కు వెళ్లాలా? అంబటి రాయుడిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!! (Video)

chiru - sukumar - rayudu
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ను అనేక మంది తెలుగు సినీ ప్రముఖులు స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్, ఆయన ఫ్యామిలీ, నటి ఊర్వశీ రౌతెలా, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు ఉన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో వీరిని కెమెరామెన్లు బాగానే ఫోకస్ చేస్తూ చూపించారు. 
 
ఈ మ్యాచ్ జరుగుతుండగానే స్క్రీన్‌పై సుకుమార్ కనిపించారు. అపుడు ఓ కామెంటర్ ప్రైడ్ ఆఫ్ తెలుగు అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కలుగజేసుకుని ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ నోరుజారారు. అంతటితో ఉండిపోకుండా, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే టీవీల్లో ఎక్కువ కనిపిస్తారు. పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన ప్రముఖులకు చెందిన సినీ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా అంబటి రాయుడుని ఏకిపారేస్తున్నారు. 
 
ఇపుడు సుకుమార్ దేశం గర్వించదగిన దర్శకుల్లో ఒకరు. ఆయన కోరుకుంటే ప్రతి రోజూ టీవీల్లో కనిపించే అవకాశం ఉంది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఖర్చు పెట్టుకుని దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదు అంటూ రాయుడుపై నెటిజన్లు మండిపడ్డారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా? కెమెరా తనవైపు తిరగాలంటే ఆయన దుబాయ్‌ వరకూ వెళ్లాలా? ఈ విషయం రాయుడికి తెలియదా? తెలుగువాడైన అంబటి రాయుడు తెలుగు సినీ ప్రముఖులపై ఇలాంటి చీఫ్ కామెంట్స్ చేయడం ఎంతమేరకు సబబు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.