భారత క్రికెట్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ జోషి ఇకలేరు..
భారత క్రికెట్ రంగంలో విషాదం నెలకొంది. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సీనియర్ క్రికెటర్ దిలీప్ జోషి ఇకలేరు. గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన లండన్లో తుదిశ్వాస విడిచారు. భారత్ తరపున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడిన జోషి... టెస్టు క్రికెట్లో 114 వికెట్లు పడగొట్టారు. 30 యేళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. గత కొన్నేళ్లుగా ఆయన లండన్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్, కుమార్తె విశాఖ ఉన్నారు.
దిలీప్ జోషి మృతిపట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మాజీ భారత స్పిన్నర్ దిలీప్ జోషి లండన్లో మరణించడం చాలా విచారకరం. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలి అని బీసీసీఐ సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాలో పేర్కొంది. గత 1947 డిసెంబరు 22వ తేదీన అప్పటి రాజ్కోట్ సంస్థానంలో జన్మించిన దిలీప్ జోషి.. తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్లో మంచి ప్రావీణ్యంపొంది గుర్తింపు తెచ్చుకున్నారు.
తన 30 యేళ్ళ వయసులో 1979 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన జోషి... 1979 నుంచి 1983 మధ్యకాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. మొత్తం 33 టెస్ట్ మ్యాచ్లు, 15 వన్డేలు ఆడారు. టెస్ట్ క్రికెట్లో 30.71 సగటుతో మొత్తం 114 వికెట్లు నేలకూల్చాడు.