శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (15:00 IST)

పొరపాటున బంతికి ఉమ్ము రుద్దేసిన ఫీల్డర్.. శానిటైజ్ చేసిన అంపైర్

Umpire
బౌలర్ చేతికి బంతిని అందించే ముందు ఫీల్డర్ దానిపై ఉమ్ము లేదా చెమటని రుద్ది మెరుపును తెప్పించడం గత దశాబ్ధాలుగా కొనసాగుతోంది. టెస్టు మ్యాచ్‌ సమయంలో బంతి నుంచి స్వింగ్‌ని రాబట్టేందుకు ఫీల్డింగ్ టీమ్‌ తరచూ బంతిపై ఉమ్ము రుద్ది శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో.. బంతిపై ఉమ్ము లేదా చెమటని రుద్దడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ ఇటీవల నిషేధించింది. 
 
రెండుసార్లు ఈ తప్పిదానికి ఫీల్డింగ్ టీమ్ పాల్పడితే.. 5పరుగుల పెనాల్టీని కూడా విధిస్తామని హెచ్చరించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఫీల్డర్ డొమినిక్ సిబ్లే.. అలవాటులో పొరపాటుగా బంతిపై ఉమ్ము రుద్దేశాడు.
 
ఇన్నింగ్స్ 42వ ఓవర్‌ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ డొమ్ బెస్ బౌలింగ్‌కిరాగా.. అతనికి బంతిని అందించే క్రమంలో డొమినిక్ సిబ్లే పొరపాటున బంతికి ఉమ్ము రాసేశాడు. దాంతో.. వెంటనే తన తప్పిదాన్ని గ్రహించిన సిబ్లే.. అంపైర్ల దృష్టికి తీసుకెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ మైకేల్ గోఫ్ తన వద్ద ఉన్న టిస్యూతో బంతిని శానిటైజ్ చేశాడు. అనంతరం మ్యాచ్ మళ్లీ కొనసాగించారు.
 
మూడు టెస్టుల ఈ సిరీస్‌ని పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తున్న ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తేనే ఆటలోకి అనుమతిస్తోన్న సంగతి తెలిసిందే.