గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

గంభీర్ రక్తంలో దూకుడే కాదు.. మానవత్వం కూడా ఉంది...

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్. ఈయన రక్తంలో దూకుడే కాదు.. మానవత్వం కూడా ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు నిరూపించుకున్నారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ 6 ఏళ్ల చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్‌ రావడానికి చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేశారు. 
 
పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే చిన్నారి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్.. గంభీర్‌కు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. 
 
దీంతో గంభీర్ చొరవ తీసుకుని... ఆ చిన్నారి, ఆమె తల్లిదండ్రులు భారత్‌ వచ్చేలా వీసా ఇవ్వాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఈ నెల 9వ తేదీన ఓ లేఖ రాశాడు. ఈ లేఖను పరిశీలించిన కేంద్ర మంత్రి జైశంకర్... వారికి వీసాలు మంజూరు చేయాల్సిందిగా ఇస్లామాబాద్‌లోని బారత హైకమిషన్‌కు సూచించారు. ఆ తర్వాత వారికి వీసాలు జారీ చేసినట్లుగా గంభీర్‌కు లేఖ రాశారు. దీంతో గంభీర్‌ ఆ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
 
'అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు అది మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. తన చిన్ని పాదాలతో ఆ చిన్నారి మనకు తియ్యటి గాలిని తెస్తోంది. ఇది ఒక బిడ్డ తన పుట్టింటిని సందర్శించినట్లు ఉంది' అని పేర్కొన్నారు. 
 
ఒక దేశం మొత్తాన్ని ద్వేశించడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. పాకిస్థాన్‌లో నుంచి ఇండియాను అభిమానించేవారు ఉంటారు. ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ బాగుండాలని కోరుకునేవారు లేకపోరు. తారతమ్యాలు మరిచి ప్రతి మనిషి బాగుండాలని కోరుకుంటే ఈ ప్రపంచమే అద్భుతంగా ఉంటుంది. ఎనీ వే హ్యాట్సాప్ గంభీర్.