హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్తో గురువారం నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో భారత క్రికెటర్లు మురళి, పుజరాలు 68 యేళ్ల రికార్డును చెరిపేశారు. భారత గడ్డపై ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు సాధించిన జోడీగా అరుదైన ఫీట్ ను సాధించారు. ఈ క్రమంలో 68 ఏళ్లనాటి రికార్డును బద్దలైపోయింది.
1948-49 సీజన్లో భారత బ్యాట్స్ మెన్ విజయ్ హజారే, రూసీ మోదీలు నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ప్రస్తుత ఉప్పల్ మ్యాచ్ తొలి రోజున మురళీ విజయ్ (108), చటేశ్వర్ పుజారా (83)లు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ సీజన్లో (2016-17) వీరిద్దరూ ఐదు సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పారు. దీంతో, 68 ఏళ్ల రికార్డు కనుమరుగు అయింది.
మరోవైపు భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ 2016-17 సీజన్కిగాను వ్యక్తిగతంగా 964 పరుగులు నమోదు చేసుకున్నాడు. పుజారా ఔటవ్వడంతో బ్యాటింగ్కు దిగిన కోహ్లీ బంగ్లా ఆటగాడు ఇస్లాం వేసిన 66వ ఓవర్లో సింగిల్స్ తీసి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
2016-17సీజన్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన, భారత్ తరపున 7వ ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు. గతంలో గౌతమ్ గంభీర్(1,269), ద్రవిడ్(1,241, 1,006), మోహిందర్ అమర్నాథ్(1,182), సునీల్ గావస్కర్(1,179, 1,027), వీరేంద్ర సెహ్వాగ్(1,128, 1,079) ఒకే సీజన్లో వెయ్యికి పైగా పరుగులు తీసిన వారిలో ఉన్నారు.
అలాగే కెప్టెన్గా 2016-17సీజన్లో వెయ్యి పరుగులు చేసిన అంతర్జాతీయ ఆటగాళ్లలో కోహ్లీ 7వ వాడు. అంతకుముందు రికీ పాంటింగ్(1,483), లారా(1,253), క్లార్క్(1,178, 1,141) గ్రేమ్ స్మిత్(1,107) గ్రహమ్ గూచ్(1,058), బాబ్ సిమ్సన్(1,007) ఒకే సీజన్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో ఉన్నారు.
ఇదిలావుండగా, ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టి.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ (111 బ్యాటింగ్; 141 బంతుల్లో 12×4), ఓపెనర్ మురళీ విజయ్ (108; 160 బంతుల్లో 12×4, 1×6), ఛతేశ్వర్ పుజారా (83; 177 బంతుల్లో 9×4)లు అద్భుత శతకాలతో రాణించారు. ఫలితంగా టీమిండియా స్కోరు 356/3 పరుగులు చేసింది.