శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:10 IST)

చేతులెత్తేసిన మహిళా క్రికెటర్లు... ఇంగ్లండ్ చేతిలో ఓటమి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన నిరాశకు నిరాశతప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇవ్వలేక పోయింది.
 
ముందుగా ఇంగ్లండ్ జట్టు బౌలర్లు భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగా, అనంతరం బ్యాట్స్‌వుమెన్‌ జోన్స్‌(51, 42బంతుల్లో 3×4, 1×6), నటైలి (54, 43బంతుల్లో 5×4) రాణించడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. 
 
అంతకుముందు బ్యాటింగ్‌కు భారత్‌ 19.3ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన(34, 23బంతుల్లో 5×4, 1×6), రోడ్రిగ్స్‌(26, 26 బంతుల్లో 3×4) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్‌ చివర్లో 23 పరుగులకే ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది.
 
ఆ తర్వాత 113 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలో భారత్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఓపెనర్లు బిమంట్ - వ్యాట్ ఐదు ఓవర్లకే ఔట్‌ అయ్యారు. ఆ సమయంలో జోన్స్‌(51, 42బంతుల్లో 3×4, 1×6)తో జత కలిసిన నటైలి(54, 43బంతుల్లో 5×4) మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. 
 
ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా పడుతూ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో 17.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 25న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ జట్టు తలపడనుంది.