1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (18:28 IST)

ఐసీసీ ప్రపంచ కప్ : అదరగొట్టిన టాపార్డర్ బ్యాటర్లు .. శ్రీలంక ముందు భారీ టార్గెట్

indian batsman
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ తన ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో శ్రీలంక ముగింట 359 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా, మిగిలిన టాపార్డర్ బ్యాట్‌తో వీరవిహారం చేశారు. 
 
రోహిత్ శర్మ నాలుగు పరుగులకే ఔటైనప్పటికీ మరో ఓపెనర్ శుభమన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 92, విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో దిల్షాన్ మధుశంక వీరి జోడీని విడిదీశాడు. దీంతో కోహ్లీ మరోమారు సెంచరీ చేజార్చుకున్నాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 56 బంతుల్లో ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్ల సాయంతో 82 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు, రవీంద్ర జడేజా 34 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ చొప్పున తీశాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు గెలుపొందాలంటే 50 ఓవర్లలో 359 పరుగులు చేయాల్సివుంది.