శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:21 IST)

పొట్టి క్రికెట్ భారత్‌లోనే జరుగుతుంది : విక్రమ్ రాథోడ్

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలకు భారత ఆతిథ్యమిస్తుందని భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్‌-నవంబర్లో టీ20 ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమిస్తుందన్నాడు. అలాగే, టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టుపై ఇంగ్లండ్ సిరీసులో అవగాహన వస్తుందన్నాడు. 
 
ఐదు టీ20లు ముగిసేలోపు ఒక అంచనా లభిస్తుందన్నాడు. మ్యాచులు గెలుస్తున్నంత వరకు ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్లతో ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశాడు. నిజానికి తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే స్ట్రైక్‌రేట్‌తో అవసరమన్నాడు. 
 
'పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ భారత్‌లోనే జరుగుతుంది. అందుకే టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ త్వరగా స్థిరపడాలని కోరుకుంటున్నా. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ముగిసే సరికి ప్రపంచకప్‌లో ఆడే జట్టుపై మనకు అవగాహన రావాలి. ఈ సిరీసులో అది సాధ్యమవుతుందనే అనుకుంటున్నా. ప్రస్తుతానికి జట్టు దాదాపుగా స్థిరపడటంతో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫామ్‌ కోల్పోతే, గాయపడితే, బ్యాటింగ్‌ విభాగంగా ఇప్పుడే స్థిరత్వం సాధించాలని కోరుకుంటున్నా’ అని విక్రమ్‌ తెలిపాడు.
 
‘టీ20 బ్యాటింగ్‌ విషయానికొస్తే మేం నిలకడగా ఆడుతున్నాం. అందుకే దానిపై అతిగా ఆందోళన చెందడం లేదు. మనం గెలుస్తున్నంత వరకు, లక్ష్యాలను ఛేదిస్తున్నంత వరకు, భారీ లక్ష్యాల్ని నిర్దేశిస్తున్నంత వరకు ఎలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నారన్నది ప్రధానం కాదు’ అని రాఠోడ్‌ అన్నాడు. శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్‌ పొట్టి క్రికెట్‌ సిరీసులో తలపడుతున్న సంగతి తెలిసిందే.