1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (13:50 IST)

వాంఖడే టెస్టు.. 631 పరుగులకు టీమిండియా ఆలౌట్.. 231 పరుగుల ఆధిక్యం

వాంఖడే మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్‌ 182.3 ఓవర్లకు 631 పరుగుల వద్ద ఆలౌటైంది. రషీద్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌(9) క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగి

వాంఖడే మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్‌ 182.3 ఓవర్లకు 631 పరుగుల వద్ద ఆలౌటైంది. రషీద్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌(9) క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 231 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు సెంచరీలతో చెలరేగిపోయింది. 
 
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ముందుగా మురళీ విజయ్ సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో సూపర్ షో ప్రదర్శించాడు. మరో ఆటగాడు జయంత్ యాదవ్ తాను ఆడుతున్న మూడో మ్యాచ్ లోనే సెంచరీ చేసి అదుర్స్ అనిపించాడు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 631 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా 231 పరుగుల ఆధిక్యం సాధించి భళా అనిపించింది. 
 
451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్‌లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ 241పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు.
 
ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే మిగిలి వుండగా, మిగిలిన వంద పరుగుల్ని సింగిల్స్, డబుల్స్ చేస్తూ సాధించాడు. మరోవైపు జయంత్ యాదవ్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) శతకంతో మెరిశాడు. అయితే జయంత్ యాదవ్ ఎనిమిదో వికెట్‌గా అవుటైన కాసేపటికే విరాట్ కోహ్లీ (235; 340 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్) తొమ్మిదో వికెట్ పెవిలియన్ చేరాడు. ఇంగ్లీష్ బౌలర్ వోక్స్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 
 
ఆపై స్వల్ప వ్యవధిలో భువనేశ్వర్ కుమార్(9) కూడా అవుట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషిద్ నాలుగు వికెట్లు సాధించగా, అలీ, రూట్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వోక్స్‌, బాల్‌లకు చెరో వికెట్‌గా దక్కింది.