1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (13:23 IST)

క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానంలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

gymkhana stampade
ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయాన్ని గురువారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించింది. అయితే, ఈ టిక్కెట్లం జింఖానా మైదనంలో చేపట్టగా తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు రాగా, ఈ వార్తలను పోలీసులు ఖండించారు. 
 
ఉప్పల్ టీ20 మ్యాచ్ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానా మైదానంలో కౌంటర్లలో టికెట్లు విక్రమయిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం బుధారం రాత్రి ప్రకటించింది. దాంతో, ఉదయం తెల్లవారుజాము మూడు గంటల నుంచే వేల సంఖ్యలో అభిమానులు క్యూ కట్టారు. జింఖానా గేటు నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకూ బారులు తీరారు. 
 
వేలాది మంది ఒక్క చోటుకు చేరడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. కానీ, 11.30 దాటినా కూడా కౌంటర్లు ప్రారంభించకపోవడంతో యువకులు అసహనం వ్యక్తం చేశారు.  అదేసమయంలో కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే ఇస్తామని సమాచారం రావడంతో అభిమానులు ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు చేరుకునేందుకు పోటీ పడ్డారు. 
 
ఈ క్రమంలో తోపులాట జరిగింది. గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్లోకి దూకేందుకు కొందరు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట జరగడంతో దాదాపు 20 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో పలువురు మహిళలు, పోలీసులు కూడా ఉన్నారు. 
 
గాయపడ్డ వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రౌండ్ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది. టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. అయితే, ఇంత జరుగుతున్నా హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.