శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (07:18 IST)

కొలంబో వన్డే: మ్యాచ్‌ను గెలిపించిన శిఖర్ ధావన్

కొలంబో వేదికగా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సారథ్యంలోని యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొత్తం 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. లంక జట్టులో అత్యధికంగా కరుణరత్నె 43 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత 263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ 36.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచాడు. ధావన్ 86 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43 రన్స్), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59 రన్స్) దూకుడు ప్రదర్శించారు. 
 
మనీష్ పాండే 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు.  లంక బౌలర్లలో ధనంజయ డి సిల్వా 2 వికెట్లు తీయగా, లక్షన్ సందాకన్ ఒక వికెట్ సాధించాడు.
 
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 20న ఇదే స్టేడియంలో జరుగనుంది.