శనివారం, 5 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (08:06 IST)

రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్ట్ మ్యాచ్ : 147 యేళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి...

siraj
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ (సెంచూరియన్ పార్క్ మైదానం) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. 147 యేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ తరహాలో టెస్ట్ మ్యాచ్ జరిగిన సందర్భం లేదు. ఒకే రోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. తొలి రోజున రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసిపోయాయి. ఇరు జట్ల బౌలర్లు చెలరేగి ఆడటంతో 20 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ చేపట్టగా, ఈ ఇన్నింగ్స్‌లో కూడా భారత బౌలర్లు మూడు వికెట్లను నేలకూర్చారు. దీంతో ఒకే రోజు ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే.. భారత్ తన 153 పరుగుల వద్ద ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. ఇది ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి కావడం గమనార్హం. భారత ఇన్నింగ్ 34, 35 ఓవర్లలో సౌతాఫ్రికా బౌలర్లు లుంగీ ఎంగిడి, కిగిసో రబాడలు తలా మూడేసి వికెట్లు నేలకూల్చి, ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో 153 పరుగుల వద్ద భారత్ ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. 
 
ఈ మ్యాచ్ సంక్షిప్త స్కోరు వివరాలను పరిశీలిస్తే, 
సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. 15 పరుగులు చేసిన కైల్ వెర్రెయిన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. 
 
ఆ తర్వాత భారత తొలి ఇన్నింగ్స్‌ 34.5 ఓవర్లలో 153 పరుగుల వద్ద ముగిసింది. విరాట్ కోహ్లీ 46, రోహిత్ శర్మ 39, శుభమాన్ గిల్ 36 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లంతా డకౌట్స్ అయ్యారు. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి 3/30, కగిసో రబడ 3/38, నాంద్రే బర్గర్ 3/42 చొప్పున వికెక్టు తీశారు. 
 
పిమ్మట సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ చేపట్టింది. మొదటి ఆట ముగిసే సమయానికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ముకేశ్ కుమార్ 2, బుమ్రా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ప్రస్తుతం భారత్ 36 పరుగుల ఆధిక్యంతో ఉంది.