శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (18:00 IST)

ఐసీసీ టెస్టులో కోహ్లీ నో ప్లేస్.. కానీ ఫోర్బ్స్ జాబితాలో మాత్రం మూడో స్థానం.. ఎందుకని?

ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న యువ క్రికెటర్లలో భారత క్రికెటర్, సంప్రదాయ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ ఏడాది అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్

ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న యువ క్రికెటర్లలో భారత క్రికెటర్, సంప్రదాయ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ ఏడాది అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న కోహ్లీకి 2016 సంవత్సరానికి గాను గురువారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. 
 
ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కోహ్లి.. టెస్టు జట్టులో మాత్రం కనీసం స్థానం దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మాత్రం టెస్టుల్లో స్థానం దక్కించుకోగా, కోహ్లికి మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. 
 
గతేడాది సెప్టెంబర్ 14 నుంచి మొదలుకొని 2016 సెప్టెంబర్ 20 వరకూ మాత్రమే ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఎనిమిది టెస్టు మ్యాచ్ లు ఆడిన కోహ్లి 45.10 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ 12 నెలల సమయంలో కోహ్లి కేవలం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. 
 
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు. అదే సమయంలో రూట్ 14 టెస్టు మ్యాచ్ లు ఆడి 55.30 సగటుతో 1272 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. అందుకే కోహ్లీ వెనకబడ్డాడు. ఐసీసీ 2016 టెస్టు క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. 
 
అయితే ఫోర్బ్స్ జాబితాలో విరాట్ స్థానం సంపాదించుకున్నాడు. సినిమా, స్పోర్ట్స్ పర్సనాలిటీల ఫోర్బ్స్‌-2016 సెలబ్రిటీ జాబితాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలవగా, స్పోర్ట్ విభాగంలో క్రికెట్ సంచలనం, టీమిండియా కెప్టెన్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మూడోస్థానంలో నిలిచాడు.