గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (13:55 IST)

ప్రపంచ కప్ కోహ్లీ సేనదే అంటున్న మాస్టర్ బ్లాస్టర్

ఈనెలాఖరులో ఐసీసీ ప్రపంచ కప్ 2019 మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. అయితే, ఈ దఫా వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లే ఫేవరేట్ అంటూ పలువురు క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. కానీ, భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం మరోలా ఊహిస్తున్నారు. ఈ దఫా భారత్ ఖాతాలో వరల్డ్ కప్ చేరుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. 
 
ఆయన శనివారం ముంబైలోని ఎంఐజీ మైదానంలో సచిన్ పేరుతో పెవిలియన్ ఎండ్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ పూర్తిగా మండుటెండలో జరుగనున్నాయి. ఎండల ప్రభావానికి పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సౌకర్యంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. పైగా ఇంగ్లండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. ఈ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో భారీ మార్పులు జరిగితే తప్ప పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. 
 
మరోవైపు భారత బ్యాట్స్‌మెన్ అంద రూ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే పరిణామంగా చెప్పొచ్చు. కెప్టెన్ కోహ్లి, రోహిత్, ధావన్, రాహుల్, హార్దిక్, ధోనీ వంటివారితో భారత బ్యాటింగ్ బలీయంగా ఉంది. అంతేగాక వీరంతా ఐపీఎల్‌లో నిలకడగా రాణించడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఇక, బుమ్రా, భువనేశ్వర్, చాహెల్, కుల్దీప్, జడేజా తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. దీనికితోడు ఇంగ్లండ్ పిచ్‌లపై భారత్ మంచి అవగాహన కూడా ఉంది. దీంతో ప్రపంచకప్‌ను గెలవడం భారత్‌కు కష్టం కాబోదని మాస్టర్ బ్లాస్టర్ అంచనచా వేశారు.