శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (12:25 IST)

ఇది 1971 కాదు.. 2019.. భారత్‌కు పాకిస్థాన్ వార్నింగ్

భారత్‌కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇది 1971 సంవత్సరం కాదనీ, 2019 అనే విషయాన్ని పొరుగుదేశం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధం విధించే దిశగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అడుగులు వేస్తున్న వేళ, పాక్ ఆర్మీ ప్రతినిధి ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఫస్తూన్‌లో జరుగుతున్న నిరసనలకు భారత్‌కు చెందిన రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) నిధులందిస్తోందని ఆరోపించిన ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, గడచిన రెండు నెలలుగా ఇండియా పదేపదే అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. భారత్ చేసిన పనికి తాము గట్టి సమాధానమే చెప్పామని ఆయన అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మా పొరుగున ఉన్న దేశం గుర్తుంచుకోవాలి. ఇదేమీ 1971 కాదు. తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడిన కాలం కాదు. భారత్‌కు ధైర్యముంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. మేము జరిపిన ప్రతి దాడిలో ఏం నష్టపోయారన్న విషయాన్ని ఇండియా ఇంతవరకూ ప్రకటించలేదు' అని గఫూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.