రవీంద్ర జడేజా ఎపిసోడ్ : బీసీసీఐ న్యాయ పోరాటం!
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాకు మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) న్యాయపోరాటానికి సిద్ధమైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ పేసర్ అండర్సన్తో జడేజాకు తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాదంలో జడేజాకు మ్యాచ్ రెఫరీ డేవిడ్ బూన్ లెవల్-1 తప్పిదం కింద మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు.
ఈ తీర్పుపై జ్యుడీషియల్ కమిషనర్ గోర్డాన్ లెవిస్కు బీసీసీఐ అప్పీల్ చేసుకుంది. ఇండియన్ టీం కెప్టెన్ ధోనీ కూడా జడేజాకు విధించిన జరిమానాపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అండర్సన్పై విచారణ జరిగే ఆగస్టు ఒకటో తేదీనే జడేజా అప్పీలుపై కూడా విచారణ జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.