శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (20:18 IST)

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

tirumala laddu
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం హయాంలో కిలో నెయ్యి కారుచౌకగా రూ.320కే వస్తుందని తిరుమల లడ్డూను కల్తీ చేశారని మండిపడ్డారు. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి నాసికరకం నెయ్యిని వాడారని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. ఎవరైనా కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అని ఆయన ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని, టెండర్లు మాత్రమే పిలిచామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
రూ.320కే నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ముందూ వెనుక ఆలోచన చేయకుండా కాంట్రాక్ట్ అప్పగిస్తారా? కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. 
 
మా నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ 
 
తిరుమలలో తయారు చేసే శ్రీవారి లడ్డూ కోసం తయారు చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇదే అంశంపై శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతే నెయ్యి సరఫరా చేశామని స్పష్టం చేసింది. 
 
జూన్, జూలై నెలలోనే నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షలు కూడా సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే నెయ్యిని సరఫారా చేసినట్టు యాజమాన్యం వివరించింది. తాము ఇప్పటివరకు సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని, ఈ విషయంలో తాము కట్టుబడివుంటామని పేర్కొంది. 
 
కాగా, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఆరోపణలు రావడంతో ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది.