శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By

సఫారీలకు షాకిచ్చిన బంగ్లా పులులు

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీలు... ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా ప్రపంచ కప్ 2019 టోర్నీని బంగ్లాదేశ్ జట్టు ఘనంగా ఆరంభించి, పండుగ చేసుకుంది. లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ ఐదో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా పులులు మైదానంలో రెచ్చిపోయారు. ఆ జట్టులో ముష్ఫికుర్ రహీం (80 బంతుల్లో 78 పరుగులు, 8 ఫోర్లు), షకిబ్ అల్ హసన్ (84 బంతుల్లో 75 పరుగులు, 8 ఫోర్లు, 1 సిక్సర్), మహ్మదుల్లా (33 బంతుల్లో 46 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. సఫారీ బౌలర్లను బంగ్లా కుర్రోళ్లు ఓ ఆట ఆడుకున్నారు.
 
ఆ తర్వాత 331 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో నిలకడగా ఆడుతూ.. ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించేలాగే కనిపించింది. కానీ బంగ్లాదేశ్ బౌలర్లు సఫారీలను ఎప్పటికప్పుడు ఔట్ చేయడంలో సఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్ (53 బంతుల్లో 62 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్) ఫర్వాలేదనిపించగా, మార్క్రం (45 పరుగులు), వాన్ డర్ డుస్సెన్ (41 పరుగులు), జేపీ డుమినీ (45 పరుగులు)లు కొంత సేపు క్రీజులో నిలబడ్డారు. 
 
ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కాగా బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహీంకు 3 వికెట్లు దక్కగా, మహమ్మద్ సైఫుద్దీన్‌కు 2, మెహిదీ హసన్, షకిబ్ అల్ హసన్‌లకు చెరో వికెట్ దక్కింది. ఈ క్రమంలో బంగ్లా జట్టు సఫారీలపై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. సఫారీలు రెండో ఓటమిని చవిచూడగా, బంగ్లాదేశ్ జట్టు తొలి గెలుపును నమోదు చేసుకుంది.