సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పదస్థితిలో మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మోడల్ ఒకరు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
27 ఏళ్ల ఖుష్బూ అహిర్వార్ అలియాస్ ఖుషి కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. పూర్తిగా మోడలింగ్కే పరిమితం కావాలనే ఉద్దేశంతో కొన్ని పార్ట్టైమ్ ఉద్యోగాలను కూడా మానివేసింది. 'డైమండ్ గర్ల్' పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది.
ఖుష్బూ గత మూడేళ్లుగా భోపాల్లో నివసిస్తోంది. నగరంలో ఆమె ఖాసీమ్ అహ్మద్ అనే యువకుడితో సహజీవనం చేసింది. సోమవారం ఉదయం ఖుష్బూ ఆరోగ్యం క్షీణించడంతో ఖాసీమ్ ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఖుష్బూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించిన వెంటనే ఖాసీమ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఖుష్బూ తల్లి మాట్లాడుతూ, ఖాసీమ్ అర్థరాత్రి తమకు ఫోన్ చేసి ఖుష్బూ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని, తాను ఆసుపత్రికి తీసుకు వెళ్లానని చెప్పాడని తెలిపారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారని కూడా ఖాసీమ్ తమతో చెప్పాడని ఆమె అన్నారు. అయితే తన కుమార్తె ముఖం, శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఆమెను తీవ్రంగా కొట్టడం వల్లే మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.