సోమవారం, 10 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 నవంబరు 2025 (11:55 IST)

అమ్మమ్మ పక్కనే నిద్రిస్తున్న చిన్నారి కిడ్నాప్.. అత్యాచారం...

rape victim
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అమ్మమ్మ పక్కలో నిద్రపోతున్న నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే 
 
బంజారా తెగకు చెందిన ఓ కుటుంబం తారకేశ్వర్‌లోని రైల్వే షెడ్డు వద్ద నివసిస్తోంది. శుక్రవారం రాత్రి బాధితురాలు తన అమ్మమ్మ పక్కన దోమతెర కింద నిద్రిస్తోంది. అర్థరాత్రి సమయంలో దుండగులు దోమతెరను కత్తిరించి, నిద్రలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం, తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో బాలిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
 
'నాతో పాటే నిద్రపోతోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎవరో పాపను ఎత్తుకెళ్లారు. పాపను ఎప్పుడు తీసుకెళ్లారో కూడా నాకు తెలియలేదు. దోమతెరను కత్తిరించి ఎత్తుకెళ్లారు. పాప నగ్నంగా కనిపించింది. మా ఇళ్లు కూల్చేయడంతో రోడ్లపైనే బతుకుతున్నాం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు, ఎక్కడికి వెళ్లాలి?' అని బాలిక అమ్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
 
తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని వెంటనే తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్యాచార కేసు ఘటనలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. 
 
'తారకేశ్వర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల బూటకపు ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం పోలీసులు నిజాన్ని తొక్కిపెడుతున్నారు. ఇది మమతా బెనర్జీ పాలన అసలు స్వరూపం' అని ఆయన సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.