1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (10:38 IST)

భార్యతో గొడవ... కౌన్సెలింగ్‌కు పిలిచిన పోలీసులు.. భయపడి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

suicide
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరులో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింగి. కౌన్సెలింగ్‌కు పోలీసులు పిలవడంతో భయపడి టెక్కీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
సిద్దిపేట సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్ కుమార్(32) హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయనకు గోదావరిఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల కిందట వివాహమైంది. పెళ్లయిన నెల నుంచే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. 15 రోజుల కిందట ఎవరికి చెప్పకుండా కిరణ్ కుమార్ వెళ్లిపోవడంతో నార్సింగి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. 
 
అదేసమయంలో గోదావరిఖని ఠాణాలో అశ్విని తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని బుధవారం కౌన్సెలింగ్‌కు రమ్మని పిలిచారు. మంగళవారం సాయంత్రం తన మేన బావమరిది నరేందర్‌తో కలిసి రంగనాయకసాగర్ జలాశయానికి వెళ్లారు. నరేందర్ చరవాణి తీసుకొని మాట్లాడుతా కట్టపై ఇమాంబాద్ రోడ్డు వద్ద కొంత దూరంలో వేచి ఉండాల్సిందిగా కోరాడు. 
 
నరేందర్ సుమారు 200 మీటర్ల దూరంలో నిలబడగా, కొద్ది సేపటికి కిరణ్ కుమార్ కనిపించలేదు. జలాశయంలో, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం ఉదయం జలాశయంలో మృతదేహం తేలియాడింది. పర్యాటకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.