గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

రాధ హత్య కేసులో భర్తే కిరాతకుడు.. పట్టించిన సందేహాస్పద ప్రవర్తన

murderer
ఇటీవల ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ (35) అనే వివాహితను హత్య చేసింది కట్టుకున్న భర్తేనని తేలింది. కట్టుకున్న భర్తే.. భార్యను కారుతో తొక్తించి, బండరాళ్ళతో మోది, సిగరెట్లతో కాల్చి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మని నమ్మకంగా పిలిపించి కిరాతకంగా అంతమొందించి ఉంటాడనే అనుమానాలు తొలుత రేకెత్తాయి. రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అతని కోసం పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. రాధ అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఆ వెంటనే ఆమె భర్త, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోట మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు తరలించినట్టు సమాచారం.
 
రాధను ఆమె భర్త మోహన్ రెడ్డే మరికొందరితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు ధ్రువీకరించుకున్నట్టు తెలిసింది. ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడికి చేయూత పేరిట రూ.80 లక్షల వరకు అప్పు ఇవ్వడం, ఆ మొత్తం తిరిగి రాకపోవడంతో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్ రెడ్డి అనుమానించసాగాడు. 
 
కాశిరెడ్డి పేరిట సిమ్ కార్డులు కొనుగోలు చేసి, అతని పేరుతోనే తన భార్యతో సెల్‌ఫోనులో మోహన్ రెడ్డ ఛాటింగ్ చేసినట్టుగా గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బులిస్తామని అతని పేరుతోనే సందేశం పంపి ఈ నెల 17న ఆమెను స్వగ్రామం నుంచి కనిగిరి రప్పించాడు. అనంతరం రాధను కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో కనిగిరిలోని పామూరు బస్టాండు సెంటరులో వేచి ఉన్న రాధ వద్దకు వచ్చిన ఎరుపు రంగు కారు హైదరాబాదు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య హతమైన తర్వాత మోహన్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతని పాత్రపై అనుమానాలు రేకెత్తి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. 
 
తన స్నేహితుడికి ఇచ్చిన అప్పు వసూలుకు వేధింపులు తాళలేక తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకెళ్లి భర్తకు రాధ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. అదేసమయంలో రుణం తీసుకున్న కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో తొలుత కేసు దర్యాప్తు.. అందరి దృష్టి అతని వైపే మళ్లింది. రాధ హత్యలో మోహన్ రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.