శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (11:00 IST)

వెలిగండ్లలో వివాహిత దారుణ హత్య... గుండెలపై నుంచి కారు ఎక్కించి చంపేశారు..

murder
ఏపీలోని ప్రకాశం జిల్లా వెలిగండ్లలో దారుణం జరిగింది. మండల పరిధిలోని జిల్లెళ్లపాడు శివారులో గురువారం రాత్రి ఈ దారుణ హత్య జరిగింది. ఈమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. తొలుత కాళ్లపై కారు పోనిచ్చారు. ఆ తర్వాత ఆమె గుండెలపై కారు ఎక్కించి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన ఓ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన కుమార్తె కోట రాధ (35) కనిపించడం లేదనంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాం జిల్లెళ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన కనిపించింది. నిందితులు తొలుత రాధ కాళ్ళపై నుంచి కారును పోనిచ్చారు. దీంతో కదల్లేని స్థితికి చేరిన తర్వాత ఆమె గుండెలపై నుంచి కారు నడిపారు. 
 
ఆ తర్వాత కూడా ఎక్కడ బతుకుతుందోనన్న అనుమానంతో ముఖంపై బండరాయితో మోది అత్యంత క్రూరంగా హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతకుముందు ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లినట్టుగా తెలిపేలా ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. ఈ హత్యలో నలుగురు లేదా ఐదుగురు పాల్గొనివుంటారని భావిస్తున్నారు. 
 
దీనిపై మృతురాలి తండ్రి స్పందిస్తూ, మండలంలోని గుండ్లోపల్లికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు కలిసి రూ.50 లక్షలు అప్పు ఇచ్చారని, అవి తిరిగి చెల్లించడం ఇష్టంలేకే కాశిరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని సుధాకర్ రెడ్డి, తల్లి సుబ్బలక్ష్మిలు ఆరోపిస్తున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తామని పిలిపించి ఈ దారుణానికి ఒడిగట్టివుంటారని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, తెలంగాణకు చెందిన మోహన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ను వివాహం చేసుకున్న రాధకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరంతా కలిసి సూర్యాపేటలో ఉంటున్నారు. ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామంలో చౌడేశ్వరిదేవి కొలుపులు ఉండటంతో ఈ నెల 11వ తేదీన పుట్టింటికి వచ్చిన రాధ.. ఈ దారుణ హత్యకు గురికావడం గమనార్హం.