1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (19:18 IST)

భర్తకు మద్యం తాగించి.. రైలుపట్టాలపై పడుకోబెట్టి ప్రియుడితో హత్య చేయించిన భార్య

murder
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను తన ప్రియుడితో హత్య చేయించింది. భర్తకు పీకల వరకు మద్యం తాగించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ(35) కూలిపనులకు వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య ఉప్పర వరలక్ష్మి గతేడాది జూన్‌ 30న మాధవరం ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
అయితే, మృతుడి ఫోన్ కాల్స్ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నారాయణ రోజూ మద్యం తాగి భార్యను అనుమానిస్తూ, శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో సి.బెళగల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్నగోవిందుతో వరలక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. 
 
దీంతో భర్త వేధింపులు భరించలేని ఆమె.. భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలిసి ఆమె ప్రణాళిక రచించింది. పథకం ప్రకారం చిన్నగోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకెళ్లి మద్యం తాగించి రైలుపట్టాలపై పడుకోబెట్టాడు. రైలు పైనుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్రగాయాలై నారాయణ చనిపోయారు. చిన్నగోవిందు ఆ విషయాన్ని వరలక్ష్మికి ఫోన్‌లో చెప్పాడు. 
 
ఆ తర్వాత తమ ముందస్తు ప్రణాళికలో భాగంగా,  వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసుల విచారణలో తామే ఈ హత్య చేసినట్లు వరలక్ష్మి, చిన్నగోవిందు అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు.