1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మహారాష్ట్రలో ఘోరం.. చెట్టు కూలి ఏడుగురు భక్తులు మృతి

tree collapse
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్‌ ఆలయంలో మహా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా అకోలా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఈదురుగాలుల వీస్తున్నాయి. వీటి కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వందేళ్ల నాటి భారీ వేప వృక్షం... ఆదివారం పూజలు జరుగుతున్న సమయంలో నేల కూలి రేకుల షెడ్డుపై పడిపోయింది. దీంతో ఆ షెడ్డు కుప్పకూలి దాని కింద భక్తులు చిక్కుకుపోయారు.
 
సమాచారమందుకున్న పోలీసులు.. ఎమర్జెన్సీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుల్‌డోజర్‌ సాయంతో వృక్షాన్ని తొలగించారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.