గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (22:37 IST)

సహజీవనం సాధ్యం కాదు, చనిపోదాం రా: ప్రేయసికి విషమిచ్చి ప్రియుడు పరార్

couple
పొన్నూరు మండలం పరిధిలో వున్న మన్నవ గ్రామంలో ప్రేమికుల రోజున దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రేయసీప్రియుల్లో ప్రేయసి ప్రాణాలు పోగొట్టుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
 
మన్నవ గ్రామంలో వంశీ అనే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న యువకుడు తన సమీప బంధువు అయిన వివాహిత సునీతను ప్రేమిస్తున్నాడు. ఆమెతో క్రమంగా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సునీత తనను ప్రేమిస్తున్న వంశీతో కలిసి సహజీవనం చేసేందుకు నిర్ణయం తీసుకుని అతడితో సన్నిహితంగా వుంటూ వస్తుంది. ఇది గమనించిన పెద్దలు ఇద్దర్నీ హెచ్చరించారు. ఎవరికివారు దూరంగా వుండాలని గట్టిగా చెప్పేసారు. దీనితో వంశీ ప్రేమికుల రోజు నాడు సునీతకు ఫోన్ చేసాడు. 
 
మన ప్రేమకి పెద్దలు అడ్డంకిగా మారారనీ, కలిసి జీవించే అవకాశం లేకుండా చేస్తున్నారు కనుక కనీసం కలిసి చనిపోదాం అంటూ ఆమెకి ప్రపోజ్ చేసాడు. దాంతో సునీత వెంటనే వంశీ రమ్మని చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అప్పటికే విషం డబ్బా తెచ్చాడు వంశీ. అతడామెకి ఆ పాయిజన్ డబ్బా ఇవ్వడంతో వెంటనే దాన్ని తాగేసింది. కానీ వంశీ మాత్రం తనకు భయంగా వుందంటూ డబ్బాను అక్కడే పడేసి పారిపోయాడు. సునీత నురగలు కక్కుతూ పడిపోవడంతో గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
 
సునీతను అడ్డు తొలగించుకునేందుకే వంశీ ప్రణాళిక ప్రకారం ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాడని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. మరిన్ని విషయాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయన్నారు.