గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (09:18 IST)

సహజీవనం చేస్తూ తల్లీ కుమార్తెను కొట్టి చంపిన కిరాతకుడు

murder
ఏలూరు జిల్లా ముసునూరులో దారుణం జరిగింది. ఓ మహిళతో సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి ఒకరు చివరకు ఆ మహిళతో పాటు ఆమె కుమార్తెను కూడా కొట్టి చంపేశాడు. ఈ దారుణం ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామ పరిధి శ్రీరామనగరులో శనివారం వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన దేవరపల్లి రవి పదేళ్ల క్రితం భార్యకు విడాకులిచ్చారు. శ్రీరామ్‌నగర్‌కు చెందిన సొంగా యేసు మరియమ్మ(35) పదేళ్లుగా భర్త నుంచి దూరంగా కుమార్తె అఖిలతో(15) కలిసి ఉంటున్నారు. రవి లారీ డ్రైవరుగా పనిచేసేటప్పుడు యేసు మరియమ్మతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తూ రెండేళ్లు ఏలూరులో ఉన్నారు. 
 
గత ఎనిమిదేళ్ల నుంచి శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్నారు. అఖిల పదోతరగతి చదువుతోంది. రవికి మద్యం తాగే అలవాటుంది. దీంతో తరచూ వారిమధ్య గొడవలు జరుగుతుండేవి. కరెంటు బిల్లు కట్టేందుకు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగాడు. బిల్లు కట్టకపోవడంతో జనవరి 30న ఇంటికి విద్యుత్తుసరఫరా నిలిపేశారు. 
 
దీనిపై ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో యేసుమరియమ్మ కుటుంబసభ్యులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం రవి వారివద్దకు వెళ్లి బుద్ధిగా ఉంటానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అర్థరాత్రి దాటాక మరియమ్మను గునపంతో కణితి మీద, అఖిలను తల వెనుకభాగంలో కొట్టి చంపాడు.
 
శనివారం ఉదయం మరియమ్మ తమ్ముడు గురవయ్య ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందన లేకపోవడంతో ఇంటికి వచ్చి కిటికిలోంచి చూడగా ఇద్దరి మృతదేహాలు మంచంపై ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.