1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (08:51 IST)

కోడలిని గొంతుకోసి హత్య చేసిన మామ.. ఎందుకు.. ఎక్కడ?

తన కుమారుడు మృతికి ఇంటి కోడలే కారణమని భావించిన మామ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆ తర్వాత అనుకూలమైన సమయం రాగానే ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్న పేటలో జరిగింది. 
 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లింగన్నపేటకు చెందిన సౌందర్య  (19) అనే యువతికి అదే గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి కుమారుడు సాయికృష్ణతో ఐదు నెలల క్రితం ఇచ్చి వివాహం చేశారు. పైగా, వీరిద్దరూ అప్పటికే ప్రేమలో ఉన్నారు. 
 
 
అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. మానసికంగా కుంగిపోయారు. అప్పటి నుంచి సౌందర్య పుట్టింటికి వెళ్లి తల్లి వద్దే ఉంటుంది. 
 
 
అయితే, తన కుమారుడు మృతికి కోడలే కారణమని మామ తిరుపతి మనసులో బలంగా నాటుకుని పోయింది. దీంతో ఆమె పగ పెంచుకుని, ఆమెను ఈ భూమిపై లేకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చి, ఇందుకోసం సరైన సమయం కోసం ఎదురుచూడసాగాడు. 
 
 
ఈ క్రమంలో ఇంట్లో సౌందర్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన తిరుపతి... తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడిచేసి. గొంతుకోసి చంపేశాడు. కుమార్తెను రక్షించడం కోసం అడ్డుపడిన ఆమె తండ్రి లక్ష్మయ్యపై కూడా తిరుపతి దాడి చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేశారు.