టూరిస్ట్ సైట్స్ చూపిస్తానని నమ్మించి.. ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం..
రాజస్థాన్ రాష్ట్రంలో ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గత ఆదివారం సాయంత్రం ఈ జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బాధితురాలైన ఫ్రెంచ్ మహిళ, మరో ఇద్దరు మహిళా స్నేహితురాళ్లతో కలిసి ఉదయ్పూర్కు ఒక యాడ్ షూటింగ్ నిమిత్తం వచ్చారు. ఈ యాడ్ షూట్ను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. బాధితురాలు ఒక సంవత్సరం వీసాపై గత నవంబరు నుంచి భారత్లో ఉంటున్నారు.
గత ఆదివారం సాయంత్రం బాధితురాలు, ఆమె స్నేహితురాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు కలిసి ఉదయ్పూర్లోని బడ్గావ్ ప్రాంతంలోని టైగర్ హిల్స్లో ఉన్న గ్రీక్ ఫామ్ అనే రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించి భోజనం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఈవెంట్ సంస్థలోని ఓ వ్యక్తి ఫ్రెంచ్ మహిళా పర్యాటకురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు సమాచారం. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఈ ఘటనపై ఉదయ్పూర్ పోలీస్ ఎస్పీ యోగేష్ గోయల్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం కొంతమంది ఫ్రెంచ్ పర్యాటకులు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగులు కలిసి గ్రీక్ ఫామమ్ రెస్టారెంట్లో ఉన్నారు. వారు కలిసి భోజనం చేసి, డ్రింక్స్ తీసుకున్నారు. ఆ తర్వాత బాధితురాలు సిద్ధార్థ్ అనే వ్యక్తితో కలిసి కారులో హోటల్ గదికి వెళ్లింది. ఆ గదిలో లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది" అని తెలిపారు.
ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్టు ఎస్పీ యోగేష్ గోయల్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. రెస్టారెంట్ మరియు హోటల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. నగరంలోని చూడదగిన ప్రదేశాలను చూపిస్తానని నమ్మించి ఫ్రెంచ్ మహిళా పర్యాటకురాలిని సిద్ధార్థ్ తన వెంట తీసుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.