1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (17:39 IST)

మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

suicide
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. శభాష్ పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో తల్లి రంజిత, ఆమె పిల్లలు ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. వేమువాడ అర్బన్ మండలం రుద్రవరంకి చెందిన రజిత కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీ అనే వ్యక్తిని గత తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రజిత పుట్టింటివారు వేముల వాడలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. రెండు నెలల క్రితం కేసును కొట్టివేశారు. భార్యాభర్తలిద్దరూ రాజీకి రావడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అయితే, గత మూడు రోజుల క్రితం రజిత తన పిల్లలతో పుట్టింటికి రాగా మర్నాడు తన భర్త దగ్గరికి వెళ్లాలని కుటుంబీకులు చెప్పగా.. తన పిల్లలతో జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.