శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (17:14 IST)

ఇదీ అవిశ్వాసాల చరిత్ర... నెహ్రూ నుంచి మోడీ వరకు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేక

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది.
 
అయితే 2003 తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించడం ఇదే మొదటిసారి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని ఈ అవిశ్వాస తీర్మాన నోటీసును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే సాధారణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే దానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇపుడు టీడీపీతో పాటు.. కాంగ్రెస్, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన సభ్యులు మద్దుత ఇచ్చారు. ఫలితంగా ఈ అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్ ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో వివిధ ప్రభుత్వాలు ఎదుర్కొన్న విశ్వాస పరీక్షలు, అవిశ్వాస తీర్మానాలను పరిశీలిస్తే.... 
 
పార్లమెంట్ 66 ఏళ్ల చరిత్రలో లోక్‌సభలో ఇప్పటివరకు అనేక విశ్వాస, అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగింది. మద్దతు నిరూపించుకోలేకపోవటంతో ఐదుగురు ప్రధానమంత్రులు తమ పదవికి రాజీనామాలు చేశారు. 1952-62 మొదటి పదేళ్లలో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి అవిశ్వాస తీర్మానాలనూ ఎదుర్కొనలేదు. 1963 ఆగస్టు నెలలో తొలిసారి నెహ్రూ సర్కారుపై లోక్‌సభలో సోషలిస్ట్ నేత జేబీ కృపలానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న యేడాదిన్నర కాలంలో ఆయన ప్రభుత్వంపై 1964లో ఒకటి, 65లో రెండు అంటే ఏకంగా మూడు అవిశ్వాస తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. అయితే నెహ్రూ, శాస్త్రిల హయాంలో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో భారీ మెజారిటీ ఉన్న కారణంగా ఆ అవిశ్వాసాలన్నీ వీగిపోయాయి. ఇకపోతే, మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీ ప్రభుత్వంపై రికార్డు స్థాయిలో 15 అవిశ్వాస తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. 
 
ఆ తర్వాత 1999 ఏప్రిల్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వెళ్లిపోయింది. దీంతో ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సి నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ఈ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయింది. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 1987లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. 
 
ఆ తర్వాత 1991-96 మధ్య కాలంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మూడు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని ఐదేళ్ల పాటు పూర్తికాలం కొనసాగింది. చివరగా 2003లో వాజ్‌పేయి ప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోయింది. ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. 
 
ప్రస్తుతం ఆ కూటమికి 321 సభ్యుల మద్దతు ఉంది. అంటే సంఖ్యాపరంగా ఎన్డీయే కూటమి సర్కారు బలంగా ఉన్నప్పటికీ.. అవిశ్వాస తీర్మానంపై చర్చంటూ జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పనితీరును సభలో ఎండగట్టేందుకు విపక్ష పార్టీలకు మంచి అస్త్రంగా ఉపయోగపడనుంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగనుంది.