మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By venu
Last Modified: మంగళవారం, 2 మే 2017 (18:15 IST)

ఆడపిల్ల కంటే బ్యాలెట్ పేపరే ముఖ్యమన్న పెద్దాయనా తదుపరి రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్నారు...

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అన్న మనుస్మృతికి జన్మనిచ్చిన భారతదేశంలో ఆ స్త్రీలకు, వారి గౌరవానికే భంగం కలిగించేలా, కించపరిచే వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు కొదవే లేదు. స్త్రీల దుస్తుల గురించి, అలంకరణల గురించి.. ఒకటని లేకుం

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అన్న మనుస్మృతికి జన్మనిచ్చిన భారతదేశంలో ఆ స్త్రీలకు, వారి గౌరవానికే భంగం కలిగించేలా, కించపరిచే వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు కొదవే లేదు. స్త్రీల దుస్తుల గురించి, అలంకరణల గురించి.. ఒకటని లేకుండా అన్నింటి గురించి అవలీలగా నోటికొచ్చిన కామెంట్లు చేయడం, రెండుమూడు రోజులు మీడియాలో ఏకిపారేసిన తర్వాత అంతే సులభంగా క్షమించేయమనడం పరిపాటైపోయింది. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జనాలకు గుర్తుండవనుకున్నారో, లేక ఆయనే మరిచిపోయారో కానీ ఓ రాజకీయనేత కొత్త ఎత్తుగడలు వేసి, దేశానికే తలమానికమైన అత్యున్నత పీఠాన్ని అధిరోహించాలని కలలు కంటున్నారు. 
 
చెప్పాలనుకున్న విషయం ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువ గురించి. దేశ భవిష్యత్తుని, పెద్దోళ్ల రాజకీయ చరిత్రని మార్చేయగల సామాన్యుని చేతిలోని మహత్తర ఆయుధం ఓటుకు ఉన్న శక్తి గురించి.. మరి తెచ్చిన పోలిక - ఆడపిల్లలతో. దేశంలో స్త్రీలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి పోలిక సహజంగానే ఎందరికో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో రేగిన దుమారం స్త్రీవాదులకు గుర్తుండే ఉంటుంది.
 
ఈ వ్యాఖ్యలు చేసిన పెద్దాయన జనతాదళ్ (యు) నేత శ్రీమాన్ శరద్ యాదవ్ గారు. ఏ అమ్మాయి గౌరవానికైనా భంగం వాటిల్లితే అది ఆ ఒక్క ఇంటికే పరిమితమని, కానీ ఓటుని అమ్ముకుంటే అది యావత్ దేశ గౌరవానికే భంగం కలిగిస్తుందన్న ఆయన మీ ఓటు విలువ మీ కుమార్తె గౌరవం కంటే గొప్పదని పేర్కొన్నారు. తర్వాత రేగిన దుమారంలో వెనక్కు తగ్గి యథావిధిగా క్షమాపణలు చెప్పేసారు. ప్రస్తుతం ఈయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్న శరద్ యాదవ్ భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటై తనకు రాష్ట్రపతి పదవిని కట్టబెట్టాలని కోరుకుంటున్నారు. భాజపా, ఆరెస్సెస్‌లు తమ సిద్ధాంతాలను బలవంతంగా దేశప్రజలపై రుద్దుతున్నాయన్న శరద్, మోడీ పాలనలో జమ్మూ నుండి తమిళనాడు వరకు అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సెలవిచ్చారు. 
 
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తమలో తమకు గల విభేదాలను పక్కనపెట్టి, రాష్ట్రపతి ఎన్నికలో భాజపాకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే శరద్ యాదవ్‌ను ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తేవచ్చని తెలుస్తోంది. మరి తెస్తారో లేదోనన్నది చూడాల్సి వుంది.